బ్లాగు పెద్దలకు
అయ్యా
నేను ఈ మధ్యనే మధుకీల అనే పేరుతో ఒక బ్లాగును తెరచుకొని నా అభిప్రాయాలను, కవితలను పొందుపరుస్తున్నాను. దివంగత రాజశేఖర రెడ్డి గారిపై నేను ఈ క్రింది లింకులో వ్రాసిన కవితను బుజ్జి అనే ఓ బ్లాగరి కొన్ని మార్పులతో తన బ్లాగులో మరో శీర్షికతో ప్రచురించుకొన్నారు. ఆ విషయాన్ని బొల్లోజు బాబా గారు గుర్తించి కామెంటు పెట్టారు. వారికి నా కృతజ్ఞతలు.
పెద్దలారా
దయచేసి ఈ విషయాన్ని ఖండించండి. తప్పొప్పులను మీరే నిర్ణయించండి. కనీసం ఈ అన్యాయాన్ని గుర్తించామనైనా తెలియచేయండి. ఇలా అయితే ఇక బ్లాగుల్లో వ్రాసుకొనే రాతలకు విలువేమి ఉంటుంది. ఈ రోజు ఈ విషయం నాకు జరిగింది. రేపు మరొకరికి జరిగవచ్చు. దయచేసి స్పందించండి.
అక్షరాలను మధించాను భావమనే సుధకోసం అంటూ గొప్పగా టాగ్ లైన్ గా వ్రాసుకొన్నారు. అంటే ఇదేనా??
పై పోస్టుకు కొనసాగింపు ఇది.
స్పందించిన అనానిమస్ గారికి, బృహస్పతి గారికి, పదనిసలు గారికి ధన్యవాదములు
బుజ్జిగారు తమ బ్లాగులో క్షమాపణలు ఈ విధంగా కోరారు
క్షమించాలి ... నేను మీ కవితలొ లైన్స్ బాగున్నాయ్యని అనుకరించి వ్రాసాను.... కాని నేను ఉదయం ఆఫీసుకు వెళ్ళీతే మళ్ళీ రాత్రి 11.30 కీ వస్తాను... అప్పటి నుండి కవితలు వ్రాస్తాను... అక్కడ అనుకరించి అని వ్రాయడం మర్చిపొయాను... బాగా రాత్రీ కావడం వల్ల కావలంటె ఆ కవిత పొస్టింగ్ టైమ్ చూసుకొండి... అంతే కాని దాన్ని దొంగతనంగా పేరు సంపాదించాలని మాత్రం కాదు... అలా అయితే నా కవితలు చాలా పేపర్స్ లొను మేగ్జయిన్స్ లొను వచ్చాయి... నా కధలు 15.5.09 స్వాతి లొ అచ్చుఅయింది...
ఎదయినప్పటికి మీ అనుమతి లేకుండా నేను అనుకరించడం తప్పు కనుక ఆ కవితను నా బ్లాగ్ నుండి
తొలిగిస్తున్నాను...
మీ యొక్క పెద్ద మనసును బాధ పెట్టి ఉంటే ఈ చిన్న వాడిని క్షమించండి.... ఇట్లు.. రేవా....
వారు పెద్ద వారు అయిఉండవచ్చు, వారి కవితలు పెద్ద పేపర్లలో వచ్చిఉండవచ్చు, కానీ తాను అనుకరించానని చెప్పటం మరచిపోయానని అనటం క్షమార్హం కాదని అనుకొంటున్నాను. కానీ అలా చేయటం తప్పు అని ఒప్పుకొని, తన బ్లాగునుంచి ఆ కవితను తొలగించానని చెపుతున్నారు కనుక ఈ విషయం ఇక్కదితో వదిలివేయటం మంచిదని అనిపిస్తుంది.
కానీ ఒక్క విషయం వారు తన బ్లాగులో తన పోస్టును తొలగించారు కనుక ఈ పోస్టుకు అర్ధం లేకుండా పోతుంది కనుక వారి అనుకరణను ఇక్కడ యధాతధంగా ఇస్తున్నాను. Let this be an example to every one who tries to forge like this.
I once again thank every one who stood by me for this cause. Thank you all
My poem
రాజశేఖరునికి అక్షర నివాళి
వింత కాకపోతే
సూర్యుడు చచ్చిఫోవటమేమిటి?. ఇక్కడ లేడంటే
ఎక్కడో కాంతి యాత్ర చేస్తున్నాడనే.
ఓ రైతు తన పచ్చని పైరును
చేతులతో తడుముకోవటం.
ఫీజ్ రీఎంబర్స్ మెంట్ తో అడ్మిషను పొందిన
ఓ విద్యార్ధి తన పుస్తకాలను గుండెల కద్దుకోవటం.
చచ్చి బతికిన ఓ అస్వస్థుని
తడి కనులలో వెలుగుతున్న దీపాన్ని.
నేను చూసాను నేను చూసాను.
ధరల విస్ఫోటనంలో మెతుకు కతుకుతున్న
పేద బతుకుల్లోని ఆత్మస్థైర్యపు సౌందర్యాన్ని.
ఓ చిన్నారి గుండె కవాటం ఒడ్దుపై పడ్డ చేప నోరైన వేళ
దానికి జీవ జలాల్ని అందించిన హస్తవాసిని.
నేను చూసాను నేను చూసాను.
జీవితపు నడకను వృద్దాప్యం దోచుకుపోతే
మూడో కాలై నిలిచి నడిపిస్తున్న పించను కర్రను.
అధికవడ్డీ అనకోండాలకు కబళింబపడుతున్న
జీవితాలలో తక్కువవడ్డీ రుణాల నెమలీక స్పర్శల్ని.
నేను చూసాను నేను చూసాను.
ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని, ఒక విశ్వసనీయతను
ఒక ఆశను, ఒక ఉత్సవాన్ని, ఒక ధీర దరహాసాన్ని
నా సమూహంలో నేను చూసాను నేను చూసాను.
మట్టిలోంచి వచ్చింది కాస్తా మట్టిలోకి చేరిందంతే.
కానీ మనసులోంచి వచ్చింది ఎప్పటికీ వీడిపోదు.
అలా ప్రవహిస్తూనే ఉంటుంది.
నేను చూస్తున్నాను. నేను చూస్తాను.
బుజ్జి గారి అనుకరణ (అనుకరణ అని వారు ఇప్పుడు చెప్పుకొంటున్నారు)
వింత కాకపోతే సూర్యుడు చచ్చిపొవడమేమిటి?.
ఇక్కడ లేడంటే ఎక్కడో కాంతి యాత్ర చేస్తున్నాడనే కదా....!
రైతు తన పచ్చని పైరును చేతులతో తడుముకోవటం ఏమిటి...?
పురుగు పీడ పట్టిన పంటను సరిచేయలన్న తపనతొనే కదా...!
విద్యార్ధి తన పుస్తకాలను గుండెల కద్దుకోవటం ఏమిటి...?
తన ఉన్నత ఆశయాల తరంగాల చిరునవ్వులను చిందించాలనే కదా....!
చచ్చి బతికిన ఓ అస్వస్థుని తడి కనులలో వెలుగుతున్న దీపాన్ని ఆర్పుకొవడమేమిటి...?
అస్తమిస్తున్న గుడ్డివాడి గుండెలొ సూర్యొదయం చూడాలనే కదా...!
ధరల విస్ఫోటనంలో మెతుకు కతుకుతున్నపేద బతుకుల్లోని ఆత్మస్థైర్యపు సౌందర్యం ఏమిటి...?
స్వేదం చిందిన బంగారపు మట్టిలొ మాణిక్యాలు విరియాలనే కధా....!
చిన్నారి గుండె కవాటానికి జీవ జలాల్ని అందించిన హస్తవాసి ఏమిటి....?
ధైర్య ఉత్సహపు ధీర దరహాసాన్ని అందించాలనే కధా....!
మూడ కాళ్ళ జీవితపు నడకను వృద్దాప్యం దోచుకొవడం ఏమిటి....?
నెమలీక స్పర్శలతొ నడిపిస్తున్న భావితరపు బాట కొసమే కధా....!
నా మనసులోంచి వచ్చిన ఆలొచన మట్టిలొ చేరడం ఏమిటి...?
విశ్వసనీయత తొ నిండిన ఆశను మీలొ పెంపొదించాలనే కధా...!
బొల్లోజు బాబా గారి కామెంటు
మిత్రమా
ఈ క్రింది లింకులోని కవితస్పూర్తితో ఈ కవిత వ్రాసానని చెప్పి ఉంటే బాగుండేది. మీ నిజాయితీనలుగురికీ తెలిసేది. ఈ రోజు మీరు నా దృష్టిలో ఒక గ్రంధ చౌర్యం చేసిన వ్యక్తిగా మిగిలిపోయి ఉండేవారు కాదు. పై కవితకు మాతృక రాజశేఖరునికి అక్షర నివాళి* .....
బ్లాగు మధుకీల కవి: సంజీవ్
అందరికీ ధన్యవాదములు తెలియచేసుకొంటూ
మీ
సంజీవ్